మధ్యాహ్న భోజనం తర్వాత ఓ కునుకు తీస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. చాలామంది వృత్తిఉద్యోగాలు, వ్యక్తిగత పనుల రీత్యా మధ్యాహ్నం నిద్రను త్యాగం చేస్తుంటారు. కానీ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా.. ఓ అరగంట విరామమిచ్చి కునుకు తీయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారికి మరింత మేలు కలుగుతుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల తలెత్తే పీసీఓఎస్, థైరాయిడ్, మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమై సమస్యలు అదుపులోనే ఉంటాయి.
విశ్రాంతి లేకుండా పని చేయడం, మధ్యాహ్నం నిద్రను త్యాగం చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. కాసేపు కునుకు తీయడం వల్ల ఒత్తిడి దరిచేరదు.
తీరకలోని పనుల వల్ల అలసిన శరీరానికి మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఆఫీస్లో ఉన్నా ఇతర ఏ పనుల్లో ఉన్న మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.