
రైలు లేట్.. ఎక్కడ కూర్చోవాలో తెలియక ప్లాట్ఫామైనే గంటల తరబడి గడిపే ప్రయాణికుల కష్టాలకు చెక్ పడింది. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలో పరిశుభ్రమైన, సురక్షితమైన, ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి సౌకర్యంతో ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది.

విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక రైలు కోసం గంటల తరబడి ప్లాట్ఫామ్పై వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ సేవలను ప్రారంభించారు. ప్లాట్ఫామ్ నంబర్-1లో ఏర్పాటు చేసి మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటిలో మహిళల కోసం ప్రత్యేక పాడ్స్, కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు ప్రత్యేక ఫ్యామిలీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పాడ్లో ఎయిర్ కండిషనింగ్, వ్యక్తిగత లాకర్, హైస్పీడ్ వై-ఫై, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన బెడ్డింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అవసరమైతే అదనపు చార్జీతో వేడి నీరు, ప్యాకేజ్డ్ ఫుడ్, తాగునీరు, శీతల పానీయాలు కూడా పొందవచ్చు..

ఈ సేవలను మూడు గంటల వరకు రూ.200, పన్నెండు గంటల వరకు రూ.400 చెల్లించి వినియోగించుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే రైలు టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స్టేషన్లోనే లేదా ఫోన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు..

రైల్వే అధికారుల ప్రకారం.. ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్నందున, వారికి సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన విశ్రాంతి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ సేవల ద్వారా ప్రయాణికులకు ఉపయోగం కలగడంతో పాటు రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు