
వందేభారత్ రైళ్లలలో మరిన్ని మార్పులు తీసుకురానుంది ఇండియన్ రైల్వేస్. వీటిని కూడా 'హై-స్పీడ్' రైళ్ల కేటగిరీలో చేర్చేలా వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం ట్రాక్ సామర్ధ్యం బట్టి ఈ వందేభారత్ రైళ్లు గంటకు 60 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా.. రానున్న రోజుల్లో ఆ వేగాన్ని 200 నుంచి 220 కిమీ మేరకు పెంచాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

వందేభారత్ రైళ్ల తయారీలో ప్రస్తుతం స్టీల్ లోహాన్ని వాడుతుండగా.. హై-స్పీడ్ వేగాన్ని అందుకోవాలంటే.. అల్యూమినియం లోహాంతో రూపొందించాలి. ఇదంతా అయ్యేందుకు కనీసం రెండేళ్లు పట్టొచ్చునని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 25 మాత్రమే నడుస్తున్నాయి. ఈ వందేభారత్ రైలు తయారీ కేవలం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని తయారీ అవుతున్నాయి. అందుకే వచ్చే ఏడాది మార్చి నాటికీ 77 రైళ్లు తయారు అయ్యేలా ఐసీఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది.

ఇక వందేభారత్ ఏసీ స్లీపర్ మరికొన్ని నెలల్లో పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ కొత్త వెర్షన్ను తయారు చేసే దిశగా రైల్వే అధికారులు అడుగులేస్తున్నారు. ఏసీ స్లీపర్లో 1 టైర్ ఏసీ ఒక కోచ్, టూ టైర్ ఏసీ 4 కోచ్లు, త్రీ టైర్ ఏసీ 11 కోచ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

కాగా, రానున్న రోజుల్లో వందేభారత్ రైళ్లు మూడు రంగుల్లో పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం తెలుపు, నీలం కలిపిన రంగు అందరినీ ఆకట్టుకుంటుండగా.. మరో రెండు రంగుల్లో ఒకటి కాషాయం, బూడిద.. మరొకటి బూడిద, కాషాయం కనిపించేలా తయారు చేస్తున్నారు.