
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం ఉప్పాక గ్రామంలో మనుషులకే కాదు, జంతువులపైనా ప్రేమ, అనురాగం ఎంతగా ఉంటుందో చూపించే సంఘటన చోటుచేసుకుంది.

ఉప్పాక గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఎంతో ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. ఆ కుక్క మరణంతో దాన్ని పెంచిన కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులు కూడా ఎంతో వేదనకు గురయ్యారు.

దీంతో కుక్క ఇన్ని రోజులు తమ కుటుంబ సభ్యుల్లానే ఉండటంతో దాని అంత్యక్రియలు కూడా శాస్త్రోక్తంగా జరపాలని నిర్ణయించారు, ఉప సర్పంచ్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి ఆ కుక్కకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

కుక్కను పూలతో అలంకరించి, ఊరంతా తీసుకెళ్లి, చివరగా ప్రత్యేక స్థలంలో సమాధి చేశారు, ఈ ఘటన జంతువులపైనా మనుషులకున్న అనురాగాన్ని ప్రతిబింబిస్తూ, “ప్రేమకు జాతి, జీవి అనే తేడా ఉండదు” అనే సందేశాన్ని ఇస్తోంది, ఉప్పాక గ్రామంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.