
ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ సమసిపోని సమస్య పేదరికం. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే పేదరికం విషయంలో భారత్ అవలంబిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కరిపించింది. భారత్ పేదరికంపై విజయం సాధించడంలో ముందంజలో ఉందని కొనియాడింది.

ఇండియాలో 2005-06 నుంచి 2019-21 దాకా.. 15 ఏళ్లలో ఏకంగా 41.4 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్తో కలిసి గ్లోబల్ మల్టిడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.

అలాగే గత 15 సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటపడటంలో భారత్ సహా 25 దేశాలు మంచి ఫలితాలు సాధించాయని తెలిపింది. ఇందులో కాంగో, ఇండోనేషియా, చైనా, మొరాకో, సెర్బియా, వియాత్నం సహా పలు దేశాలున్నాయని పేర్కొంది. వాస్తవానికి భారత్లో 200-06లో 55.1 శాతం పేదరికం ఉండగా.. 2019-21 నాటికి వాళ్ల సంఖ్య ఏకంగా 16.4 శాతం తగ్గిపోయిందని వెల్లడించింది.

భారత్ గత 15 ఏళ్ల క్రితం 64.5 కోట్ల మంది పేదలు ఉండేవారని చెప్పింది. కానీ 2019-21లో 23 కోట్ల మంది పేదలు ఉన్నారని పేర్కొంది. మరో విషయం ఏంటంటే సరైన పౌష్టికాహారం అందుబాటులో లేని వారి సంఖ్య 44.3 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గిందని వివరించింది.

అలాగే శిశుమరణాలు కూడా 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. పారిశుధ్య సదుపాయాలు 50.4 శాతం మందికి అందుబాటులో ఉండేవి కావని.. ఇప్పుడు వాటి సంఖ్య 11.3 శాతానికి తగ్గిందని చెప్పింది. అదేవిధంగా చాలామందికి తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించడంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని ప్రశంసించింది.