
ఈ మధ్య కాలంలో బయటి ఫుడ్ తినే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఏ కాస్త సమయం దొరికితే చాలు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ లొట్టలేసుకొని మరి తింటున్నారు. కొందరు బయటకు వెళ్లి తింటే, ఇంకొందరేమో ఏకంగా ఇంటి వద్దకే ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్, ముఖ్యంగా ఫ్రైడ్ రైస్ వారానికి రెండు లేదా మూడు సార్లు తింటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంట. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. వండిన అన్నాన్నే మళ్లీ వేడి చేసి, దానిని ఫ్రై చేస్తారు కాబట్టి ఇది జీర్ణక్రియ సమస్యలకు కారణం అవుతుందంట. దీని వలన కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, వంటి ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా ఫ్రైడ్ రైస్ లో వాడిన నూనెను పదే పదే వాడుతుంటారు. అంతే కాకుండా, మసాలాలు, అధిక ఆయిల్. వాడిన నూనెలను మళ్లీ మళ్లీ వేడి చేయడం వలన ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు హాని చేస్తాయంట. ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తినడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ను పెంచి, గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు బయటి ఫుడ్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

ఫ్రైడ్ రైస్లో సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్ వంటి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉప్పు అధికంగా వాడుతారు. అందు వలన ఇది రక్తపోటును పెంచే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దీని వలన అనేక సమస్యలు దరి చేరుతాయంట. అందుకే హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు అస్సలే బయటి ఫుడ్, ముఖ్యంగా చైనీస్ ఫుడ్కు దూరం ఉండాలంట.

చైనీస్ ఫుడ్, ఫ్రైడ్ రైస్లలో కేలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన త్వరగా బరువు పెరగడమే కాకుండా, ఊబకాయం బారినపడే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ ఫుడ్ ఎక్కువగా తినడం వలన ఇది తలనొప్పి, ఛాతిలో మంట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.