
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి పేరెంట్స్ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టీఎస్ టెన్త్ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మంగళవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫలితాలు విడుదలైన వెంటనే పదో తగరతి ఫలితాలను టీవీ9 ( www.tv9telugu.com )వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,39,493 మంది హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది.

ఇదిలా ఉంటే గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది.