
మన దేశంలో స్మార్ట్ఫోన్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే కామన్ యాప్ వాట్సాప్. దానికి అంతా అలవాటు పడిపోయారు. ప్రభుత్వం సంస్థలు కూడా తమకంటూ ఒక వాట్సాప్ నంబర్ను కలిగి ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఒక ఆధార్ కార్డ్ లాగా వాట్సాప్ అకౌంట్ కామన్ అయింది. అయితే ఇంత పాపులర్ అయిన వాట్సాప్ వాడేందుకు ఎవరూ కూడా ఒక్క రుపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అది ఇప్పటి వరకు అని చెప్పుకోవాలి. ఇక వాట్సాప్ను పూర్తిగా ఫ్రీగా వాడలేం. వాట్సాప్లో ఇప్పటి వరకు వాడుతున్నట్లు చాట్ చేయడం, స్టేటస్ పెట్టుకోవడం, వీడియో కాల్స్ చేయడం వంటి ఫ్రీగా చేయొచ్చు. కానీ, యాడ్స్ రాకుండా ఇతరుల స్టేటస్ చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావొచ్చ.

త్వరలోనే వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి.. లక్షలాది మంది వాట్సాప్ యూజర్లు షాక్ అవ్వొచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మెటా తన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ కోసం చెల్లింపు సేవను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ఇటీవల బీటా అప్డేట్లో కనిపించింది. దీనితో వాట్సాప్ ఇకపై వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా ఉండకపోవచ్చు అనే ఆందోళనలు తలెత్తాయి.

ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉన్న చెల్లింపు ఆఫర్ల మాదిరిగానే వాట్సాప్ కోసం సబ్స్క్రిప్షన్ ఆధారిత ఫీచర్ను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఈ రాబోయే ఫీచర్ యాప్లోని వాట్సాప్ స్టేటస్ విభాగంలో గుర్తించబడింది.

నివేదిక ప్రకారం ప్రకటనలు లేకుండా స్టేటస్లను వీక్షించడానికి వినియోగదారులు సబ్స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి రావచ్చు. YouTube మోడల్ లాగానే, చెల్లింపు సబ్స్క్రిప్షన్ను ఎంచుకోని యూజర్లు వారి కాంటాక్ట్ల స్టేటస్ అప్డేట్లను వీక్షించే ముందు ప్రకటనను చూడవలసి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్ ట్రయల్ వెర్షన్లో మాత్రమే కనిపిస్తుంది.

ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగానే, వాట్సాప్ ద్వారా డబ్బు ఆర్జించడానికి మెటా అనేక మార్గాలను అన్వేషిస్తోంది. వాట్సాప్ నిర్వహణ ఖర్చును తిరిగి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. వాట్సాప్ ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 800 మిలియన్ల మంది వినియోగదారులను, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 బిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది, ఇది కంపెనీకి గణనీయమైన ఆదాయ అవకాశంగా మారింది.