
ఇటీవల ఫిట్నెస్ బ్యాండ్లపై ఆదరణ బాగా పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలు వీటిని తయారీ చేస్తుండడం, సరికొత్త ఫీచర్లు ఉండడంతో బాగా పాపులర్ అవుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు పెద్దలను దృష్టిలో పెట్టుకునే చాలా కంపెనీలు ఫిట్నెస్ బ్యాండ్లను తయారు చేస్తున్నాయి.

కానీ తాజాగా అమెరికాకు చెందిన 'ఫిట్ బిట్' సంస్థ ఏస్3 పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాండ్ను తీసుకువస్తోంది. మార్చి 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

ఆరేళ్లు, అంతకు మించి వయస్సు గల పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ బ్యాండ్ను తయారు చేశారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది రోజుల బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది.

ఈ బ్యాండ్ సహాయంతో తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. చిన్నారుల హార్ట్ బీట్ను ట్రాక్ చేసే అవకాశం ఉంది.

మన కరెన్సీలో దీని ధర సుమారు రూ.7,300గా ఉంది. ఈ బ్యాండ్ పిల్లల రోజువారి నడక, వ్యాయామాన్ని పరిశీలించి వారి అచీవ్మెంట్స్ను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.