
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైంది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.

అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది.

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము జీవంచాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే.

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు, అరటి పండ్లు, వంటి అన్ని పూజలకు ఉపయోగించే పూజా సామాగ్రి వరలక్ష్మి వ్రతానికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ రోజున స్పెషాలిటీ ఏమిటంటే.. నవ సూత్రంతో కూడిన తోరం. అంటే పూజ చేసే మహిళలందరూ తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమ అద్దాలి.

మొదట పసుపుతో గణపతిని పూజించి అనంతరం కలశంలోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను

తోరగ్రంథి పూజ చేసి.. తోరం ధరించిన అనంతరం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుని లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం నవకాయ పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. వాయినంగా నానబెట్టిన శనగలు పంచిపెట్టాలి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే.. తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును. అయితే శ్రావణ రెండవ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ