
ఆదివారం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ దీపోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మనం త్రేతా అయోధ్యను చూడలేదని.. ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతో ఇప్పుడు అమృతకల్లో అమర అయోధ్యను చూస్తున్నామని అన్నారు.

చోటి దీపావళి రోజున అయోధ్యలో ఘనంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

దీపోత్సవ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దాదాపు 26 నిమిషాల పాటు జరిగిన లేజర్ షోను ఆస్వాదించారు.

లేజర్ షో ద్వారా రామకథను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రంగురంగుల దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించారు.

లక్షలాది దీపాల వెలుగుతో.. కాంతులు వెదజల్లిన అయోధ్యలో ఎప్పటికీ మరిచిపోలేని దృశ్యం కనిపించింది. దీపోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి కూడా పాల్గొన్నారు.

దీపోత్సవ సందర్భంగా సుందరంగా తీర్చిదిద్దిన సరయూ నది తీరం సుమారు 17 లక్షల దీపాలతో వెలిగిపోయింది. సరయూ నది ఒడ్డుతో పాటు అయోధ్యలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లోనూ మరికొన్ని ప్రమిదలను వెలిగించారు. బాణాసంచా కాల్చి పండగను జరుపుకున్నారు.

ఈ దీపోత్సవం కోసం 22 వేల మందికి పైగా వాలంటీర్లు ఐదు రోజుల పాటు శ్రమించి ఏర్పాట్లు చేశారు. రాముడి పాదంతో పాటు అయోధ్య మొత్తాన్ని దీపాలతో వెలుగులతో నింపేశారు.