
ఈ ఆలయం తాలిప్పరంబ నుండి 10 కి.మీ దూరంలో కేరళలోని కన్నూర్లో ఉంది. ఈ ఆలయం పేరు ముత్తప్పన్ ఆలయం. ఈ ప్రసిద్ధ ఆలయం వలపట్టణం నది ఒడ్డున ఉంది. ఇది అందమైన దృశ్యం, విశిష్టమైన సంప్రదాయం ఈ ఆలయానికి సొంతం. ఈ ఆలయంలో ముత్తప్పన్ను పూజిస్తారు. శ్రీ ముత్తప్పన్ జానపద దేవుడు. శివుడు, విష్ణువుల కలయికగా కలియుగ అవతారంగా భావిస్తారు.

ఈ దేవుడికి నైవేద్యాలలో ఎక్కువ భాగం కల్లు , కాల్చిన చేపలు, పెసర పప్పు, టీ, ధాన్యాలు, కొబ్బరి ముక్కలను ప్రసాదంగా పెడతారు. ముత్తప్పన్ కు వీటిని సమర్పించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. దర్శనం తరువాత భక్తులకు పప్పు, టీని కలిపి ప్రసాదంగా అందిస్తారు.

సర్వసాధారణంగా మన ఆలయాల్లో దైవాన్ని శైవ అంశంగానో, ఇటు విష్ణు స్వరూపంగానో ఆరాధింపబడతారు. కానీ ముత్తప్పన్ను మాత్రం ఇద్దరు దేవతలకూ ప్రతీకగా భావిస్తుంటారు. ముత్తప్పన్ ఆకారంలో ఉండే చిన్న పాటి మార్పుని బట్టి వలియ ముత్తప్పన్గానో (విష్ణువు) చెరియ ముత్తప్పన్గానో (శివుడు) కొలుచుకుంటారు.

ఈ ఆలయాన్ని "పరస్సి నికడవు ముత్తప్పన్ దేవాలయం" అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో బ్రాహ్మణ విధి విధానాన్ని అనుసరించరు. ప్రధాన దైవం ముత్తప్పన్ కు మద్యాన్ని, చేప, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తారు.

ఈ ఆలయంలో ఏ జాతి వారైనా, ఎలాంటి మతం వారైనా స్వామివారిని పూజించవచ్చు. ఈ ఆలయంలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. ముత్తప్పన్ కు కుక్కలంటే మహా ప్రీతి. అందుకనే ఈ ఆలయంలో గుంపులు గుంపులుగా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయ ద్వారానికి ఇరువైపులా కూడా కుక్కల విగ్రహాలు ఉంటాయి.

ఆలయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం తొలి ప్రసాదాన్ని కుక్కలకే పెడతారు. తర్వాత ఆలయంలోకి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెడతారు.

ఈ ఆలయం థియం అని పిలువబడే సాంప్రదాయ నృత్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ముత్తప్పన్ ని దర్శిస్తే.. తమను ప్రమాదాల నుండి కాపాడతాడని భక్తుల నమ్మకం. భక్తులకు ఆలయంలో ఉచిత వసతి సౌకర్యాలు ఉన్నాయి.