
దేవతల భూమి ఉత్తరాఖండ్ లో పవిత్ర పుణ్య క్షేత్రం హరిద్వార్. హిందువులు హరిద్వార్ కు వెళ్లడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. హరి అంటే విష్ణువు ద్వార్ అంటే దారి. అంటే హరిని చేరుకునే మార్గం అంటారు. గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం చిందిన ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి అని పురాణాల కధనం.

హరిద్వార్ లోని గంగా ఒడ్డున నిర్వహించే కుంభమేళా ఈరోజు (ఏప్రిల్ 1) ప్రారంభమైంది. 30 వరకు కుంభమేళా నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 12, 14 మరియు 27 తేదీలను విశిష్టంగా భావిస్తారు. హరిద్వార్ కుంభమేళా సమయంలో భక్తుల్లో గంగా స్నానం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది.

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళ సాధారణంగా మూడున్నర నెలలు ఉంటుంది. అయితే మళ్ళీ కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో కుంభమేళా వ్యవధిని తగ్గించారు. చరిత్రలో మొదటిసారిగా నెల రోజులు మాత్రమే కుంభమేళా వేడుకలను నిర్వహిస్తున్నారు. గతంలో కుంభమేళ జనవరి 14 నుండి 2010 ఏప్రిల్ 28 వరకు హరిద్వార్లో జరిగింది.

ఈసారి కుంభమేళా వేడుకల్లో పాల్గొనే భక్తులు 72 గంటల లోపు నిర్వహించిన "నెగటివ్" ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భక్తులు తమ సర్టిఫికెట్లను అధికారిక పోర్టల్లో అప్లోడ్ చేసి మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది.

హరిద్వార్ లో జరిగే కుంభమేళాలో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందు వచ్చిన హిందూమత నాయకులకు, సాధు సంతలకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కాం గంథన్ పంచాయత్ కు చెందిన ముస్లిం పెద్దలు భక్తిపూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. హిందూ సోదరులు వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. తరతరాలుగా ఈ సాంప్రదాయం సాగుతుంది.