
ప్రపంచ దేశాల్లో అతి పురాతన నగరం వారణాసి. గంగా నది ఒడ్డున వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. గంగా నది కేవలం ఒక ప్రవాహం మాత్రమే కాదు. ప్రాచీన కాలం నుండి భారతదేశపు తపస్సుకు సాక్ష్యం గంగానది. నదులను పవిత్రంగా భావించి పూజిస్తారు. 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల్లో భక్తులు స్నానమాచరిస్తారు. జన్మ తరించినట్లు భావిస్తారు.

ఈ రోజు నుంచి పవిత్ర గంగానది పురష్కారాలు ప్రారంభమయ్యాయి. గంగామాతను ఎల్లప్పుడూ కోట్లాది మంది హిందువులు పూజిస్తారు. ఈ నేపథ్యంలో జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైన కాశీలో గంగా స్నానం కోసం భక్తులు చేరుకున్నారు.

కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి.. పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం వారణాసిలో ప్రవహిస్తున్న గంగమ్మ చెంతకు భక్తులు పరుగులు పెడుతున్నారు. కాశీలో గంగమ్మ తీరాన ఉన్న ఘాట్లను దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన ఘాట్లు ఎన్నో వున్నాయి. గంగా పుష్కరాల కోసం వారణాసిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

దేశ వ్యాప్తంగా యాత్రికులు కాశి నగరానికి తరలి వెళ్ళుతున్నారు. ముఖ్యంగా కాశీలోని గంగా స్నానం చేయడానికి భారీగా తెలుగు యాత్రికులు తరలివెళ్తున్నారు. తెలుగు యాత్రికులను దృష్టిలో పెట్టుకొని NDRF సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు తెలిసిన సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ రోజు సూర్యోదయానికి ముందు నుంచే కాశీలో పెద్ద ఎత్తుల భక్తులు పవిత్ర గంగా స్నానాలు చేస్తున్నారు. కాశీకి తరలి వచ్చిన వారిలో అత్యధిక శాతం తెలుగు యాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది.

పుష్కరాల కోసం స్నానం చేసే క్రమంలో భక్తుల రక్షణ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భక్తులు గంగా ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఏర్పాట్లు చేసింది. గంగా నది తీరంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మొహరించాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. తెలుగులో మైక్లో అనౌన్స్ చేస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యమని భావించి భక్తులు దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. వాస్తవానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు ఏ జీవిని కాశి లోనికి అనుమతించడని హిందువుల నమ్మకం.