
భ్రమరాంబికా దేవి స్వామివారితో కలిసి పురవీధుల్లో రావణవాహనం వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు మల్లన్న స్వామీ అమ్మవారిని మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకోనున్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించారు.

బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు,పలువురు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు అధికారులు సాదర స్వాగతం పలికారు.

శ్రీశైలం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపద్యంలో శ్రీస్వామి అమ్మవార్లకు మంత్రి కొట్టు తన వ్యక్తిగతంగా శ్రీ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొట్టు దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మచారి అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నారు.