
ఈ ఏడాది భోగి పండగ పుష్య మాసం పౌర్ణమి తిధి..సోమవారం.. ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. కనుక ఈ రోజుని శివ ముక్కోటి అంటారు. ఈ అద్భుతమైన కలయిక దాదాపు 110 సంవత్సరాల తర్వాత జరిగింది. దీంతో ఈ ఏడాది చేసుకునే భోగి పండగ వెరీ వెరీ స్పెషల్ గా నిలవనునది.

భోగి రోజు తెల్లవారు జామునే కుటుంబ సభ్యులు అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంటను వేస్తారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా కర్పూరం, ఆవు నెయ్యిని జోడించి రగిలిస్తారు. ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

భోగిమంటల్లో వేసే వస్తువుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. పిల్లలు ఆవు పేడతో చేసిన పిడకలను భోగి దండలుగా గుచ్చి ఈ భోగి మంటల్లో వేస్తారు.

మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో భోగిమంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

భోగి పండగ సమయానికి చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది. భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. అంతేకాదు పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి క్రిమి కీటగాదులు ఇళ్ల వైపు వస్తాయి. ఇవి ఇంట్లోకి రాకుండా భోగిమంటలు ఉపయోగపడతాయి.

అంతేకాదు సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు. క్రమంగా వాతావరణంలో ఎండ వేడి పెరుగుతుంది. ఈ మార్పుని తట్టుకోలేక శరీరం ఇబ్బంది పడుతుంది. అప్పుడు జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. అయితే ముందు రోజు అంటే భోగి రోజున ఇలా మంటలు వేయడం వలన వాతారణంలో రానున్న మార్పుకి శరీరాన్ని రెడీ చేసినట్లు అవుతుంది.

భగ' అనే పదం నుంచి భోగి' అన్న మాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అని నమ్మకం.