
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు అక్కడి వాతావరణం.. పర్యాటకుల మనసు దోచుకుంటుంది. సీజన్కు తగ్గట్టుగా అక్కడ ప్రకృతి మరింత పులకించిపోతుంది. సహజ సిద్ధ అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. తాజాగా.. విరబూస్తున్న మే ఫ్లవర్స్ ఏజెన్సీలో ఆకట్టుకుంటూ ఉన్నాయి.

మే నెల వచ్చిందంటే చాలు.. చాలాచోట్ల మే ఫ్లవర్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది గిరిజనులు తమ పెరటిలో ఈ మొక్కలను పెంచుతుంటే.. మొక్కలకు పూచే ఈ పూలు ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటాయి. గుత్తుల గుత్తులుగా.. ఎర్రటి బంతుల ఆకారంలో కనువిందు చేసే ఈ పూలు కేవలం వేసవి సీజన్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఏప్రిల్ చివరి వారంలో మే వరకు విరబూస్తూ ఉంటాయి.

జీకే వీధి మండలం సీలేరులో ఇప్పుడు ఈ పూలు భారీగా పూచాయి. ఏపీ జెన్కో ఉద్యోగి నాగేశ్వరరావు దంపతులు పెరట్లో వేసిన మే ఫ్లవర్స్ విరబూసి కనువిందు చేస్తున్నాయి. ఈ మే ఫ్లవర్స్ ను బ్లడ్ లిల్లీ, ఫుట్బాల్ లిల్లీ అని కూడా పిలుస్తారు. ఫుట్బాల్ సైజులో గుండ్రంగా ఎర్రటి పూసల్లాంటి రేఖలతో కాంతివంతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

దీని ప్రత్యేకత ఏంటంటే గుండ్రంగా కనిపిస్తున్న ఇదంతా ఒకే పుష్పం కాదు.. పుష్పాల సమూహం. ఒకేసారి ఒకే చోట గుత్తులుగా వందల సంఖ్యలో పూలు పూయడంతో బంతి ఆకారంలో కనువిందు చేస్తూ ఉంటుంది.మే ఫ్లవర్స్ మనదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ పుష్పాలను ఇళ్లల్లో, ఆలయ ఆవరణలో అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. ఈ ఫ్లవర్స్ నీడ ఉన్నచోట, తేమ ఉన్న ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా లేని ప్రాంతాల్లో పెంచుతారు. సీలేరులో ఒకేసారి భారీగా మే ఫ్లవర్స్ కనువిందు చేస్తుండడంతో.. చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.