
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మునగాకు: రెండు కప్పులు లేతవి మాత్రమే తీసుకోవాలి , నువ్వులు: అర కప్పు, ధనియాలు: ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు: ఒక కప్పు, చింతపండు: నిమ్మకాయ సైజు , వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు, కరివేపాకు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు నువ్వులు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపటమనే వరకు వేయించాలి. వేగిన నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

దీని తర్వాత మునగాకును కూడా అలాగే వేయించాలి. మునగాకు పచ్చి వాసన పోయి, దగ్గర పడే వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని, ఒక కప్పు టమాటా ముక్కలు, చింత పండు వేసి మూతపెట్టాలి. అవి మంచిగా ఉడికి, మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, కరివేపాకు , పచ్చి మిర్చి , మునగాకు, టమాటా చింత పండు, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, అరటీస్పూన్ జీలకర్ర, సరిపడ ఉప్పు ఇవన్నీ రోటీలో వేసి మంచిగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచిన తర్వాత దీనిని మరొక బౌల్లోకి తీసుకోవాలి.

ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, చిన్న పోపు పాన్ పెట్టి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండు మిరిపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ పోపును మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్లో వేయాలి. అంతే మునగాకు రోటీ పచ్చడి రెడీ.