
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూశారు . కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అహ్మదాబాద్ UN మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రధాని మోదీకి, ఆమె తల్లి హీరాబెన్కు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన చివరిసారి తన తల్లిని కలిశారు మోదీ. ఆమెతో చాలా అప్యాయంగా గడిపారు.

మాతృమూర్తి అంటే ప్రధాని మోదీ ఎనలేని ప్రేమ. జూన్ 23న ఆమె పుట్టినరోజునాడు, సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం రోజు కచ్చితంగా హీరాబెన్ దగ్గరికి వస్తారు మోదీ. కానీ, ఈసారి సెప్టెంబర్ 17నే రాలేకపోయానంటూ మోదీ బాధపడిన సందర్భమూ ఉంది.

రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. దేశాన్ని నడిపిస్తున్న నాయకుడైనా తల్లిని చూడగానే చిన్నపిల్లాడిలా కనిపించేవారు ప్రధాని నరేంద్ర మోదీ.

తన తల్లి హీరాబెన్మోదీ 100వ పుట్టిన రోజు సందర్భంగా గాంధీనగర్కు వచ్చారు మోదీ. హీరాబెన్ పాదాలు కడిగి, మిఠాయి తినిపించారు. 100వ పుట్టిన రోజును జరుపుకున్న తల్లికి సేవలు చేశారు ప్రధాని.

హీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్లోని మెహసానాలోని వాద్నగర్. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్చంద్. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. మూడవ సంతానంగా ప్రధాని మోదీ జన్మించారు.

పెద్దకుమారుడు సోమ మోదీ, ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి. పంకజ్ మోదీ, గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్, అమృత్ మోదీ, రిటైర్డ్ లేత్ మెషిన్ ఆపరేటర్, ప్రహ్లాద్ మోదీ రేషన్ షాప్ యజమాని.. హీరాబెన్ కూతురు పేరు వాసంతీబెన్ హస్ముఖ్లాల్ మోదీ. ఇక మూడో కుమారుడు నరేంద్ర మోదీ.. మన భారత ప్రధానమంత్రి.

తన భర్త మరణం తర్వాత, హీరాబెన్ మోదీ తన చిన్న కొడుకు పంకజ్ మోదీ ఇంట్లోనే ఉన్నారు. ఆమె 2016 మేలో మొదటిసారి ఢిల్లీలోని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని సందర్శించారు. ఆయన పలుమార్లు దీవెనలకై గాంధీనగర్లోని తన తల్లి దగ్గరికి వెళ్ళివస్తుంటారు.

2016 నవంబరులో పాత కరెన్సీ నోట్లను బ్యాన్ చేయడంపై తన కుమారుడి నిర్ణయానికి మద్దతుగా ఆమె ATM క్యూలో నిలబడి అందరిని ఆకట్టుకుంది.

2019 లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని హీరాబెన్ మోదీ ప్రచారం చేయడమేకాక 99 ఏళ్ల వయసులో కూడా ఆమె ఓటు వేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఓటేశారు.