
భారత్కు కొరకరాని కొయ్యలా తయారవుతున్న చైనా తాజాగా వాస్తవాధీన రేఖపై దృష్టిసారించింది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

చైనా తాజాగా వాస్తవాధీన రేఖ వెంబడి తన ఆర్మీని ఎల్లవేళలా మోహరించేందుకు కాంక్రీటు క్యాంపుల నిర్మాణం చేపడుతోంది. కొద్ది సమయంలోనే సరిహద్దులో అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

ఉత్తర సిక్కిం నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా తమ భూభాగంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నకులా సెక్టార్లో గతేడాది భారత్, చైనా బలగాలకు ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కొద్ది మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

తూర్పు లద్దాఖ్, అరుణాచల్ సెక్టార్ల వద్ద కూడా చైనా వైపు ఈ తరహా అధునాతన భవన నిర్మాణలు చేపట్టినట్టు తెలుస్తోంది.

తూర్పు లద్దాఖ్, అరుణాచల్ సెక్టార్ల వద్ద కూడా చైనా వైపు ఈ తరహా అధునాతన భవన నిర్మాణలు చేపట్టినట్టు తెలుస్తోంది.

తూర్పు లద్దాఖ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో చలికాలంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి. దీంతో చలికాలంలో ఈ ప్రాంతాల్లో చైనా తమ బలగాల్లో 90శాతం మందిని విడతల వారీగా మార్చాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బలగాల సౌకర్యార్థం సరిహద్దుల్లో చైనా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

సరిహద్దులకు వచ్చే రోడ్డు మార్గాలను కూడా చైనా మరింత మెరుగుపర్చింది. అంటే.. ఉద్రిక్తతల సమయంలో భారత్ కంటే ముందుగానే వచ్చి స్పందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో డ్రాగన్ మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది.

రెండు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో వివాదం సద్దుమణగలేదు. అయితే తూర్పు లద్దాఖ్లో ఇరువైపులా బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను వెనక్కి పిలిచిన డ్రాగన్.. వారిని టిబెట్కు తరలించింది.