
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల బాట..పోలవరం ఎడమ కాలువ ద్వారా తరలించే గోదావరి జలాలతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 2,87,320 ఎకరాలకు సాగునీరు.. 5.23 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం పాయకరావుపేట వద్ద విడుదలయ్యే నీటితో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. ఐదు నదులను దాటుకుంటూ..పోలవరం ఎడమ కాలువ నిర్మాణం సాధారణమైన పని కాదు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ కాలువ ముందుకు సాగింది. తూర్పు కనుమలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టులు నిర్మించి గోదావరి జలాలకు మార్గం సుగమం చేశారు.

ఏలేరు కిందుగా.. పంపాపైగా..ఏలేరు నది బెడ్ లెవల్కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మించారు. మరోవైపు పంపా నదిపై అక్విడెక్ట్ను నిర్మించి కాలువకు అనుసంధానం చేశారు. 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్తో పునాదులు వేసి పంపా అక్విడెక్ట్ను నిర్మించారు. తాండవ నదిపై 447 మీటర్ల పొడవుతో.. ఆరు వెంట్లతో అక్విడెక్ట్ను ఏర్పాటు చేశారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా దీన్ని నిర్మించారు. భూవివాదానికి పరిష్కారం.. 472 కుటుంబాలకు పునరావాసం..ఎడమ కాలువ నిర్మాణంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించారు. ఈ ప్రక్రియలో మొత్తం 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. భూ సమస్యలను పరిష్కరించడంతో కాలువ నిర్మాణానికి ఎదురైన అవరోధాలను అధిగమించారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదలయ్యే గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు స్థిరీకరించనున్నారు. ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించనున్నారు. పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలు.. తాండవ, వరాహ, మామిడిగెడ్డ పరిధిలో 46,620 ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది.పాయకరావుపేట వద్ద విడుదల చేయనున్న గోదావరి జలాలను అనకాపల్లి వద్ద ఏలేరు కాలువకు తరలించడంతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో సాగునీటి అవసరాలతో పాటు స్థానిక నీటి వనరులకు కూడా భరోసా లభించనుంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం ద్వారా మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. తాగునీటి కాలువలతో కలిపి మొత్తం 213 కిలోమీటర్ల మేర ఎడమ కాలువ నిర్మాణం జరిగింది. భవిష్యత్లో మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించారు.

ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా అందే ప్రయోజనాలకు తోడు.. భవిష్యత్లో దీన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానించే ప్రణాళికలు ఉన్నాయి. ఆ అనుసంధానం పూర్తయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుంది. పోలవరం ఎడమ కాలువ–ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్రలోని సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం ఉంది. దీంతో పోలవరం ఎడమ కాలువ కేవలం ఒక సాగునీటి కాలువగా కాకుండా.. ఉత్తరాంధ్ర భవిష్యత్ జల అవసరాలకు కీలక ఆధారంగా మారనుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ.4,192 కోట్లు వ్యయం చేశారు. ఎన్నో సాంకేతిక సవాళ్లు, భూసేకరణ సమస్యలు, నదీ ప్రవాహాలను దాటాల్సిన క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

నిన్న వెలిగొండ.. నేడు పోలవరం ఎడమ కాలువ.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వెలిగొండ తర్వాత పోలవరం ఎడమ కాలువ కీలక ఘట్టంగా నిలవనుంది. ఒకవైపు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగు అవసరాలకు వెలిగొండ ద్వారా జలభరోసా ఏర్పడుతుండగా.. మరోవైపు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల ప్రవాహం ప్రారంభం కానుంది. పోలవరం ఎడమ కాలువలో గోదావరి జలాల ప్రవాహం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర జలచరిత్రలో ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రస్తుతం సాగు, తాగునీటి అవసరాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు.. భవిష్యత్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం ద్వారా మరింత విస్తృత ప్రాంతానికి నీటిని అందించే అవకాశాన్ని ఇది తెరుస్తోంది.