వారాహి విజయభేరి యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో శనివారం రాత్రి జరిగిన సభలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
'సిద్ధం పేరిట కేవలం ప్రచార హోర్డింగులకే రూ.600 కోట్లు ప్రజాధనం లూటీ చేసిన జగన్ పేదవాడు అని పవన్ విమర్శించారు. అయిదేళ్లు అధికారం లేకున్నా ప్రజల తరఫున పోరాడిన అన్నారు.
సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ ఇచ్చే వైసీపీ ఫ్యానును పూర్తిగా పక్కన పడేయాల్సిన సమయం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను నమ్మి మళ్లీ మోసపోవద్దని పిలుపునిచ్చారు.
జగన్ పదేపదే ఈ ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం అని మాట్లాడుతున్నాడు. ఆయన పార్టీ తరఫున ఎన్నికల్లో దిగుతున్న అభ్యర్థులు ఒక్కోక్కరికి కోట్ల మేర ఆస్తులున్నాయి పవన్ విమర్శించారు.
నేను పిఠాపురంలో గెలిచాక ఈ మాఫియా డాన్ ఆటలు కట్టిస్తాను. ఆయన తాటాకుచప్పుళ్లకు బెదిరిపోయే వ్యక్తిని కాదు. మత్స్యకారులను నోటికొచ్చినట్లు తూలనాడిన డాన్ ఇంటికి పంపించే తీరుతాం అని పవన్ అన్నారు.