
ఈ మొక్క రాళ్ల మధ్యలో పెరుగుతుంది. ఎర్రని ఎండలను సైతం తట్టుకుని ఎండి పోయినా ఒక్క చుక్క నీరు పడగానే మళ్లీ జీవం పోసుకుంటుంది. ఈ అరుదైన మొక్క నెమలి పింఛం ఆకారంలో చిన్న తాటిచెట్టులా దర్శనమిస్తుంది. అందుకేనేమో మయూర శిఖ, పాంఫెర్న్ అనే పేర్లతో పిలుస్తారు ఈ మొక్కను వృక్షశాస్త్ర నిపుణులు.

వేడి వాతావరణం, విపరీతమైన ఎండలు ఉన్న సమయంలో తన ఆకులను చుట్టుకొని ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నీటి తడి తగలగానే కొన్ని గంటల్లోనే పచ్చగా మారిపోతుంది. ఈ వింత గుణాలు ఉన్న ఈ మొక్క ఆయుర్వేదంలో రారాజుగా వెలుగొందుతుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సాంప్రదాయ మందుగా ఉపయోగిస్తారట.

తీవ్ర గాయాలు మాన్చడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, విష నివారిణిగా ఈ మొక్కను ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తారు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లోని సహ్యాద్రి పర్వతాలు నెలవైన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని కొండలపై ఈ బుజ్జి మొక్కల ను గుర్తించారు సారంగాపూర్ Deputy Forest Range Officer మహ్మద్ నజీరా ఖాన్.

ఆక్టినియోప్టెరీస్ రాడియాట (Actiniopteris radiata) అనేది టెరిడోఫైటా (Pteridophyta) కుటుంబానికి చెందిన ఒక చిన్నపాటి అరుదైన అరుదైన ఫెర్న్ (Fern) జాతి మొక్క అని మహ్మద్ నజీర్ ఖాన్ తెలిపారు. ఇది కేవలం ఒక అంగుళం నుండి రెండు, మూడు అంగుళాల ఎత్తు మాత్రమే పెరుగుతుందంట.

దీని ఆకులు చిన్నవిగా, విసనకర్ర ఆకారంలో.. నెమలిపింఛం వలె చాలా సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయని నజీరా ఖాన్ తెలిపారు. ఇవి సాధారణంగా వేడిగా, పొడిగా ఉండే రాతి ప్రాంతాలు, రాతి పగుళ్ల మధ్య పెరుగుతాయని.. కరవును సైతం తట్టుకుని జీవిస్తాయని.. కొద్దిపాటి నీరు లేదా తేమ తగలగానే మళ్లీ జీవం పోసుకుని పచ్చగా మారుతాయని వివరించారు.