
సమ్మర్లో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ముఖం నల్లగా మారడం. ఎండవల్ల చర్మం త్వరగా నల్లగా మారుతుంది. ఇలా ఎండ వల్ల మీరు కోల్పోయిన కాంతిని తిరిగి పొందాలన్నా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా ఇంట్లో ఉండే రైస్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. రైస్ వాటర్లో చర్మ సౌందర్యానికి అనుకూలమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించి, మచ్చలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కాబట్టి రైస్ వాటర్ ఫేస్ ప్యాక్ ముఖాన్ని ఎలా మెరిపించుకోవాలో చూద్దాం.

రైస్ వాటర్లో కొన్ని పదార్థాలను కలపి జల్లా తయారు చేసి వాడితే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు కావాల్సిన పదార్థాలు ½ కప్పు పచ్చి తెల్ల బియ్యం,1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, గ్రీన్ టీ: 2 టేబుల్ స్పూన్లు, తేనె: 1 టీస్పూన్, విటమిన్ E క్యాప్సూల్: 1, గ్లిజరిన్: ½ టీస్పూన్ , ఫర్మెంటెడ్ రైస్ వాటర్: 1 టేబుల్ స్పూన్ , కీరదోస రసం: 1 టేబుల్ స్పూన్

రైస్ జెల్ తయారీ విధానం: రైస్ వాటర్ జెల్ తయారు చేసుకునేందుకు ముందుగా బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత రెండు కప్పుల నీటిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. నీరు తెల్లగా పాల రంగులో మారే వరకు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ పేస్ట్ను ఒక పలచని వస్త్రం లేదా జల్లెడ సహాయంతో వడకట్టాలి. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి.

ఈ పేస్ట్ చిక్కబడిన తర్వాత, అందులో అలోవెరా జెల్, గ్రీన్ టీ, తేనె, విటమిన్ E ఆయిల్, గ్లిజరిన్, రైస్ వాటర్, కీరదోస రసం వేసి బాగా కలపాలి. ఇలా తయారైన రైస్ జెల్ను ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోండి. దీనిని ఫ్రిజ్లో ఉంచితే వారం రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే ఈ జల్ రాసుకునేప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రైస్ వాటర్ జల్ ఎలా ఉపయోగించాలి?: జెల్ రాసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. జెల్ను ముఖంపై రాసి, వేళ్లతో సున్నితంగా రాసుకోవాలి. ఆ తర్వాత సన్స్క్రీన్ లేదా నైట్ క్రీమ్ రాసుకోవచ్చు.రాత్రి పడుకునే ముందు ఈ జెల్ రాసుకోవడం చాలా మంచిది. ఇది రాత్రంతా చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి పనిచేస్తుంది. దీనిని ప్రతిరోజూ రాత్రి పూట వాడవచ్చు. మీ చర్మం మరీ పొడిగా ఉంటే రోజుకు రెండుసార్లు కూడా ఉపయోగించవచ్చు.