
కావలసిన పదార్థాలు: 10 నుండి 12 స్లైస్ బ్రెడ్ ముక్కలు, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలు, ఒకటిన్నర కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు, అర టీస్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు, కిస్మిస్, వేయించడానికి సరిపడా స్వచ్ఛమైన నెయ్యి మరియు చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ (ఆప్షనల్).

తయారీ విధానం: బ్రెడ్ స్లైసులకు అంచుల వైపు ఉండే బ్రౌన్ భాగాన్ని కత్తిరించి, ఒక్కో బ్రెడ్ను నాలుగు చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రిజ్లో లేదా ఫ్యాన్ గాలి కింద కనీసం అరగంట పాటు ఆరబెట్టాలి. ఇలా కాస్త గట్టిపడేలా ఆరబెట్టడం వల్ల నూనె/నెయ్యిని ఎక్కువగా పీల్చుకోవు మరియు వేయించినప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయి.

స్టవ్ మీద గిన్నె పెట్టి అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలను మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు మీగడను గిన్నె అంచులకు నెడుతూ పాలు సగానికి పైగా చిక్కబడే వరకు మరిగించాలి. అందులో తరిగిన బాదం, పిస్తా పలుకులు వేసి రబ్డీలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి.

కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు, కిస్మిస్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నెయ్యిలో ఆరిన బ్రెడ్ ముక్కలను మీడియం మంటపై రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి తీసుకోవాలి. మరొక వెడల్పాటి పాన్లో ఒకటిన్నర కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి తీగ పాకం రానవసరం లేకుండా.. కాస్త జిగురుగా వచ్చే వరకు మరిగించాలి. అందులో యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ కలపాలి.

పాకం వేడిగా ఉన్నప్పుడే వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి పాకం పట్టేలా మెల్లగా నొక్కాలి. ఆ వెంటనే సిద్ధం చేసుకున్న వేడి పాల రబ్డీని బ్రెడ్ ముక్కలపై సమానంగా పోయాలి. మూతపెట్టి చిన్న మంటపై 2-3 నిమిషాలు ఉడికిస్తే బ్రెడ్ ముక్కలు పాకాన్ని, పాలను పీల్చుకుని సాఫ్ట్గా, జ్యూసీగా మారతాయి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, నోరూరించే హైదరాబాదీ రాయల్ డబల్ కా మీఠా సిద్ధం! వేడిగా తిన్నా లేదా ఫ్రిజ్లో చల్లార్చి తిన్నా అమృతంలా ఉంటుంది!