
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వివిధ గోరక్షక్ సంఘాల ప్రతినిధులతో బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గోరక్షకులు చట్టం పట్ల అత్యంత గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు తెలియజేయాలి తప్ప, ఏ పరిస్థితుల్లోనూ నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.

నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పశువధకు సంబంధించి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా లేదా ఉద్రిక్తతలు పెంచేలా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్ట్ చేసే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

వాలంటీర్లు చెక్పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫోటోలు తీయడం లేదా నిందితుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి పనులు చేయరాదని సూచించారు. పోలీసులతో సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో గోరక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులు ఉంచుకోకూడదని, పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించడం లేదా దారిలో అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేవలం పండుగ సమయాల్లోనే కాకుండా ఏడాది పొడవునా పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జరిగే అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, సమాచారం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 8712661000 ను 24 గంటలూ సంప్రదించవచ్చని తెలిపారు. పౌరులందరూ సమన్వయంతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. గోరక్షక సంఘాల ప్రతినిధులు కోరిన పలు అంశాలపై సానుకూలంగా స్పందిస్తూనే, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.