
ఆదివారం మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వారికి కచ్చితంగా నాన్వెజ్ వంటలు చేసి పెట్టాల్సిందే. వాటిలో రొయ్యల పులావ్ కూడా ఒకటి. ఇంకా మసాలాలు, రొయ్యలతో కలిపి చేస్తే అదిరిపోయే టేస్ట్తో ఈ పులావ్ ఒకసారి తింటే మళ్లీ మళ్లీ అదే చేసుకుని మరి తింటారు. ఇది అంత రుచిగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేయండి.

టేస్టీ రొయ్యల పులావ్ కు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు బాస్మతి బియ్యం, పావుకిలో రొయ్యలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, ఒక కప్పు పుదీనా ఆకులు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇంకా నూనెను తీసుకోవాలి.

పులావ్ మసాలా కోసం వీటిని తీసుకోవాలి: నాలుగు బిర్యానీ ఆకులు, మూడు దాల్చిన చెక్క లేదా పొడి, నాలుగు లవంగాలు, 4 యాలకులు లేదా పొడి అయినా వేసుకోవచ్చు. ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకోవాలి. అయితే, వీటిని వాటితో కాకుండా విడిగా తీసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.

తయారి విధానం మొదటి స్టెప్ : ముందుగా రొయ్యలను తీసుకుని బాగా కడిగి దానిలో ఉప్పు వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకుని నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక నాలుగు బిర్యానీ ఆకులు , ఇంకా లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి వేయించాలి.

ఇవి బాగా వేగిన తర్వాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యాక రొయ్యలను బాగా ఫ్రై చేఉకోవాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా పెరుగు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపటి తరవాత బియ్యం కూడా దీనిలో వేసి నీళ్లు పోసి, కుక్కర్లో 3 విజిల్స్ వరకు ఉడికించాలి. ఇలా స్టవ్ మీదే 10 నిముషాలు పాటు ఉంచి కిందకు దించుకోవడమే. అంతే, వేడి వేడి రొయ్యల పులావ్ రెడీ.