
ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టి, కంటిచూపును మెరుగుపరిచే దివ్యౌషధమైన కరివేపాకును, వేరుశనగ గుళ్లు , స్వచ్ఛమైన ఆవు నెయ్యి మరియు ఇంగువతో కలిపి చేసే 'కరివేపాకు పల్లీ రైస్' ఎంతో తేలికగా, త్వరగా పూర్తవుతుంది. ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: 1 పెద్ద బౌల్ రాత్రి మిగిలిన అన్నం, 1 గుప్పెడు తాజా కరివేపాకు, 2 చిన్న చెంచాల పల్లీలు, ఒకటిన్నర నుండి రెండు చెంచాల స్వచ్ఛమైన నెయ్యి, అర చెంచా పచ్చిశనగపప్పు, పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, 2 నుండి 3 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు తుంచిన ఎండుమిర్చి, కారానికి తగినట్లుగ కారం పొడి చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం: ముందుగా రాత్రి మిగిలిన అన్నాన్ని చేతులతో నలిపి పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో కడిగి ఆరబెట్టుకున్న గుప్పెడు కరివేపాకును వేసి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. ఆకులు కరకరలాడుతూ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో రెండు చెంచాల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించి చల్లారనిచ్చి పొట్టు తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన కరివేపాకు, పొట్టు తీసిన పల్లీలు వేసి చుక్క నీరు కూడా లేకుండా బరకగా పొడి చేసుకోవాలి.

బాండీలో ఒకటిన్నర చెంచా నెయ్యి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు-పల్లీల పొడిని బాండీలో వేసి చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ వెంటనే పావు చెంచా కారం పొడి వేసి కలపాలి.

ఇప్పుడు పొడిపొడిగా చేసుకున్న అన్నాన్ని బాండీలో వేయాలి. దీనిపై రుచికి సరిపడా ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు ఇంగువ చల్లుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి అన్నం మెతుకులకు కరివేపాకు పొడి, నెయ్యి, ఉప్పు సమంగా పట్టేలా నెమ్మదిగా కలిపి వేడెక్కే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, రాత్రి మిగిలిన అన్నంతో ఘుమఘుమలాడే కరివేపాకు పల్లీ రైస్ సిద్ధం! వేడివేడిగా తింటే నెయ్యి, వెల్లుల్లి సువాసనలతో ఎంతో కమ్మగా ఉంటుంది.