
చేనేత మగ్గంపై అక్షరాలు, చరిత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు హరి ప్రసాద్ మరో అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతిని మేళవిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై సజీవంగా ఆవిష్కరించారు.

గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు హరి ప్రసాద్ ఈ చీరను రూపొందించారు. ఇందుకోసం ఏకంగా 45 రోజులపాటు నిరంతరంగా శ్రమించారు. సాధారణ డిజైన్లకు భిన్నంగా అమ్మవారి చరిత్రను ప్రతిబింబించేలా చీరలోని ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

ఈ అపూర్వ పట్టుచీరలో 102 మంది ఋషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రకు సంబంధించిన 25 చారిత్రక చిత్రాలను చేనేత మగ్గంపై నేశారు. ఒక్కో అక్షరం, ఒక్కో గోత్రనామం, ఒక్కో చారిత్రక చిత్రాన్ని అత్యంత సూక్ష్మంగా మగ్గంపై పొందుపరచడం ద్వారా తన అసాధారణ చేనేత నైపుణ్యాన్ని హరి ప్రసాద్ మరోసారి చాటుకున్నారు.

పూర్తిగా పట్టుదారంతో రూపొందించిన ఈ చీరలో 2 గ్రాముల బంగారు జరి ఉపయోగించారు. సుమారు 7 మీటర్ల పొడవు కలిగిన ఈ ప్రత్యేక పట్టుచీర కేవలం వస్త్రం మాత్రమే కాకుండా.. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర, భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే కళాఖండంగా రూపుదిద్దుకుంది.

చేనేత మగ్గంపై వినూత్న ఆలోచనలతో అరుదైన కళాఖండాలను సృష్టిస్తున్న హరి ప్రసాద్.. ఈసారి వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రను పట్టుచీరపై ఆవిష్కరించి చేనేత కళకు మరోసారి ప్రత్యేకతను తీసుకొచ్చారు. మగ్గంపై నూలుతో చరిత్రను అల్లిన ఈ కళాఖండం చేనేత కళాకారుడి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తోంది.