
నేటి కాలంలో యువత రకరకాల హెయిర్ కలర్స్ వినియోగిస్తుంటారు. పార్టీ, పండగ, ఫంక్షన్ ఇలా సందర్భాన్ని బట్టి తీరొక్క కలర్తో జుట్టును మెరిపిస్తుంటారు. జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత లుక్ కూడా మారిపోతుంది. కానీ జుట్టుకి రంగు వేసిన తర్వాత కురులు పొడిబారిపోతాయి.

బ్రౌన్, కాపర్, చాక్లెట్, బర్గండీ.. వంటి ముదురు రంగుల దగ్గర్నుంచి ప్యూర్ డైమండ్, హనీ, క్యారమెల్.. వంటి లైట్ కలర్స్ దాకా మగువల మనసు దోచుకుంటున్నాయి. ముదురు రంగులైతే వెంట్రుకల సహజ రంగు దెబ్బతినకుండా ఉండడంతో పాటు మరింత ఆకర్షణీయంగా కనిపించచ్చు. అదే లేత రంగులైతే.. జుట్టు రంగు మార్చేందుకు వీలుగా బ్లీచ్, అమ్మోనియా వంటి గాఢమైన రసాయనాలు ఎక్కువ మొత్తంలో వాడతారు.

ఫలితంగా వెంట్రుకలు, కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అది నప్పకపోతే ఎబ్బెట్టుగానూ కనిపిస్తుంది. పైగా లేత రంగుల కంటే ముదురు రంగులే ఎక్కువమందికి నప్పుతాయి. జుట్టుకు రంగేసుకోవాలనుకున్న రెండు రోజుల ముందు నుంచే తలస్నానం చేయకపోవడం మంచిది. తద్వారా ఈ సమయంలో కుదుళ్ల వద్ద సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తై హెయిర్ కలర్స్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా రక్షిస్తాయి.

చాలా మంది వీకెండ్లో జుట్టుకు రంగు వేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ రంగు ఎక్కువసేపు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. రంగు వేసిన తర్వాత రెండు రోజుల పాటు షాంపూ చేయకూడదు. తరచుగా షాంపూ చేయడం వల్ల జుట్టు రంగు త్వరగా పోతుంది.

సల్ఫేట్ లేని షాంపూ ఉపయోగించాలి. షాంపూ చాలా ఆల్కలీన్గా ఉంటే, జుట్టు రంగు, తేమ రెండూ పోతాయి. షాంపూతో పాటు, హెయిర్ కండీషనర్, హెయిర్ మాస్క్ ఉపయోగించాలి. ఇది జుట్టు రంగును మన్నికైనదిగా చేస్తుంది. రంగు వేసిన జుట్టు మీద స్ట్రెయిట్నర్లు, డ్రైయర్లు, కర్లర్లను ఉపయోగించ కూడదు. వెంట్రుకలను తరచూ వేడి చేయడం వల్ల రంగు తీవ్రత తగ్గి, జుట్టు డల్ గా మారుతుంది.