
ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 గ్లాసులు బాస్మతి బియ్యం, 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం, పావు కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, షాజీరా, సోంపు ఇలా మొత్తం బిర్యానీ దినుసులు , 1.5 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 1.5 స్పూన్లు కారం, పావు టీస్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు-జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె మరియు ఉప్పు.

బిర్యానీ తయారీ విధానం: ముందుగా బాస్మతి, సోనా మసూరి బియ్యాన్ని కలిపి కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక పాన్లో టేబుల్ స్పూన్ నూనె వేసి బిర్యానీ మసాలాలు, సగం ఉల్లిపాయలు, సగం టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించి చల్లారాక మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.

మందపాటి గిన్నెలో నూనె వేడిచేసి హోల్ మసాలాలు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేలా వేయించాలి. ఆపై టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల జీలకర్ర పొడి వేసి వేపాలి. రుబ్బుకున్న మసాలా పేస్ట్, అర కప్పు పెరుగు వేసి నూనె తేలేవరకు వేయించాలి. ఆ తర్వాత 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు (బాస్మతికి 1¼, సోనా మసూరికి 1½ చొప్పున) పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి కలిపి, నీరు ఇంకిపోయాక నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి మూతపెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి.

క్రీమీ టమాటో షేర్వా తయారీ: మిక్సీలో అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల నువ్వులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి. అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి టమాటాలను మెత్తగా మగ్గించాలి.

ఆపై కొబ్బరి-నువ్వుల పేస్ట్ వేసి నూనె తేలేవరకు వేపి, రెండు గ్లాసుల నీళ్లు పోసి 15 నిమిషాలు మీడియం మంటపై చిక్కబడే వరకు మరిగించి కొత్తిమీర చల్లి దించాలి. అంతే, పొడిపొడిగా ఉండే గుంటూరు ఎంటీ బిర్యానీని ఘుమఘుమలాడే టమాటో షేర్వాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోయే భోజనం సిద్ధం!