
రోజుకో యాపిల్ తింటే డాక్టర్తో అవసరం ఉండదంటారు. యాపిల్ తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు యాపిల్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. యాపిల్లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ తినడం మంచిదే.

ఎంతో రుచికరంగా ఉండే బెర్రీలలో బ్లడ్షుగర్ని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీలకు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మొత్తాలలో ఉంటాయి. స్ట్రాబెర్రీస్ పొట్టను నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో శక్తి కోల్పోకుండా సహాయపడుతుంది. రక్తంలోని చక్కర నిల్వలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది.

సిట్రస్ఫ్రూట్ అయిన నారింజలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉటుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్, బీటాకెరోటిన్ ఉంటాయి. 87 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. నారింజ రక్తంలో చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచటంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు రోజూ ఆరెంజ్ తింటే మంచిని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిక్ రోగులు కివి పండును తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, తక్కువ కేలరీలు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండుతో సెరోటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రుళ్లు నిద్ర బాగాపడుతుంది.

అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవకాడో రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అవకాడో ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. అకాడోలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.