
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో తన కాన్వాయ్ ఆపి పొలాల్లోకి వెళ్ళారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. హంగూ ఆర్భాటాలకు దూరంగా, నేరుగా పంట పొలాల్లో కూలీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ క్యారేజీలు విప్పుకుంటున్న ఆడబిడ్డల మధ్యకు ఆయన హోదాను పక్కన పెట్టి.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అందుతున్నాయా తల్లులారా?" అంటూ ఆప్యాయంగా పలకరించారు. అధికారపు హంగులు, ఆర్భాటాలు లేకుండా వారితో ఆత్మీయత మాట్లాడారు. భట్టి విక్రమార్కను తమ మధ్య చూసిన ఆ మహిళ కూలీలు సంతోష పడ్డారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం తమ జీవితాల్లో వచ్చిన మార్పులను చెబుతూ వారు భావోద్వేగానికి లోనయ్యారు.

ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతోనే ఇంట్లో సంతోషంగా అన్నం వండుకుని తింటున్నాం.. మా పిల్లపాపలు కడుపునిండా అదే అన్నం తింటున్నారు" అని చెప్పినప్పుడు వారి మాటల్లో కనిపించిన తృప్తి.. సంక్షేమ పథకాల అసలైన అర్థాన్ని కళ్లముందు నిలిపింది. కరెంటు బిల్లుల గురించి అడిగినప్పుడు.. "మాకు రూపాయి బిల్లు కూడా రావడం లేదు సార్.. ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది" అని వారు చెప్పిన మాటల్లో.. ఎన్నాళ్లుగానో మోస్తున్న ఆర్థిక భారాన్ని దించుకున్న నిశ్చింత స్పష్టంగా కనిపించింది.

ఇటీవల హైదరాబాద్కు కూలీ పనుల కోసం వెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆ మహిళలు.. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతగానో ఉపయోగపడిందని ఆనందంగా చెప్పారు. ప్రయాణ ఛార్జీల కోసం ఖర్చయ్యే డబ్బు మిగలడం.. తమ కుటుంబ అవసరాలకు ఎంతో ఆసరాగా మారిందని కృతజ్ఞతతో తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీరు ఉచితంగా పొందుతున్న ప్రతి పథకానికి మీ తరఫున ఆర్థిక శాఖ ఆయా శాఖలకు క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తోంది. ప్రజల అవసరాలను గుర్తించడం.. ఆ అవసరాలను తీర్చడం.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ ప్రజాప్రభుత్వం అసలైన బాధ్యతని చెప్పారు.