
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్పై సులభంగా గెలిచిన భారత్, టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఈ విజయం ప్రత్యేకంగా నిలవడానికి కారణం ఒక్కటే కాదు. ఇది తొలిసారి కాదు. వరల్డ్ కప్ 2015లో కూడా ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ను ఓడించింది. అంతేకాదు, ఈ మ్యాచ్ జరిగిన రోజు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగ జరుపుకున్నారు. శివ భక్తులకు, దేశ ప్రజలకు టీమ్ ఇండియా ఈ రోజున గెలుపుతో ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చింది.

ఇక్కడే ఆసక్తికరమైన యాదృచ్ఛికం మొదలవుతుంది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం, 2003 ప్రపంచకప్లో కూడా మహాశివరాత్రి రోజునే భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా టీమ్ ఇండియా విజయం సాధించింది. అంటే 2003, 2015, 2026.. మూడు సందర్భాల్లోనూ ఫిబ్రవరి 15 లేదా మహాశివరాత్రి రోజు భారత్ పాకిస్తాన్పై గెలుపొందింది.

ఇక్కడే అభిమానుల్లో ఓ సందేహం మొదలైంది. 2003 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్ చేజారింది. 2015 ప్రపంచకప్లో పాకిస్తాన్ను ఓడించిన తర్వాత సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియానే చివరికి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. అంటే, పాకిస్తాన్పై ఫిబ్రవరి 15న గెలిచిన రెండు సార్లూ భారత్ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఇప్పుడు 2026లో కూడా అదే తేదీ, అదే మహాశివరాత్రి రోజు గెలుపు రావడంతో “మళ్లీ చరిత్ర రిపీట్ అవుతుందా?” అనే చర్చ మొదలైంది.

ఈసారి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమతూకంగా కనిపిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్తోంది. యంగ్ ప్లేయర్లు ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు. అయితే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్తో మొత్తం కథ మారిపోతుంది. సెమీఫైనల్, ఫైనల్ల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లతో తలపడాల్సి వస్తే గతంలో జరిగినట్లే చిన్న తప్పిదం కూడా ట్రోఫీ చేజారడానికి కారణమవుతుంది. ఈసారి “మహాశివరాత్రి సెంటిమెంట్” కేవలం యాదృచ్ఛికమా? లేక గతంలో జరిగినట్లే పాకిస్తాన్పై గెలిచిన తర్వాత టైటిల్ చేజారే సంకేతమా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

2003, 2015ల్లో భారత్ టైటిల్ కోల్పోయింది. కానీ 2026లో పరిస్థితులు మారాయని అభిమానులు ఆశిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ, టీమ్లోని బ్యాలెన్స్, అనుభవం.. ఇవన్నీ కలిసి టీమ్ ఇండియాను ఈసారి ట్రోఫీ దిశగా నడిపిస్తాయా? లేక గత చరిత్ర మరోసారి రిపీట్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఫైనల్ రోజు మాత్రమే దొరుకుతుంది. అప్పటివరకు మాత్రం “పాకిస్తాన్పై మహాశివరాత్రి రోజు గెలిచిన ప్రతీసారి భారత్ ట్రోఫీ కోల్పోయింది” అన్న సెంటిమెంట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతూనే ఉంటుంది.