
టీమిండియా ప్లేయర్లు రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. అటు యువ క్రికెటర్లు మాత్రమే కాదు.. అంతర్జాతీయ అనుభవమున్న సీనియర్లు సైతం తమ సత్తాను చాటుతున్నారు. ఇటీవల అస్సాంతో జరిగిన మ్యాచ్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెలరేగిపోయాడు.

తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధులను బెంబేలెత్తించడమే కాదు.. ప్రత్యర్ధి జట్టును కేవలం 84 పరుగులకే ఆలౌట్ చేశాడు. టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఠాకూర్.. గాయం కారణంగా సఫారీ టూర్ మధ్యలోనే ఇండియా తిరిగొచ్చేసిన సంగతి తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్టుల్లో ఠాకూర్ను ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే సెలెక్టర్లు అతడి స్థానంలో వేరే ఆప్షన్ ఎంచుకున్నారు.

ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఠాకూర్.. రంజీల్లో ముంబై తరపున బరిలోకి దిగాడు. తన స్వింగ్ బౌలింగ్తో ఇటీవల అస్సాంతో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు.

అస్సాం జట్టు ఓపెనర్ ముషారఫ్(2) మొదలైన ఠాకూర్ వేట.. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ అనే తేడా లేకుండా సాగింది. బ్యాట్స్మెన్లను నిలదొక్కుకోనివ్వకుండా.. వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లాడు శార్దూల్ ఠాకూర్.

ఈ ఇన్నింగ్స్లో కేవలం 10 ఓవర్లు వేసిన ఠాకూర్ 21 పరుగులిచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడి బౌలింగ్ ధాటికి అస్సాం తొలి ఇన్నింగ్స్ కేవలం 84 పరుగులకే ముగిసింది. ఆ జట్టులో అభిషేక్ ఠాకూరీ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.