
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా డేంజరస్ బ్యాట్స్మెన్ ఐడెన్ మార్క్రామ్ భారీ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అది కూడా వన్డే ప్రపంచకప్లో ఇప్పటివరకు ఎవరూ చేయని రికార్డు కావడం గమనార్హం.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన క్వింటన్ డి కాక్ (100), రస్సీ వాండర్ డస్సెన్ (108) సెంచరీ చేశారు. దీని తర్వాత రంగంలోకి దిగిన ఐడెన్ మార్క్రమ్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు.

ఆరంభం నుంచి భీకర బ్యాటింగ్ కనబరిచిన ఐడెన్ మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే 3 సిక్సర్లు, 14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసి, సరికొత్త రికార్డులను తన పేరుతో లిఖించాడు.

దీంతో పాటు వన్డే ప్రపంచకప్లో 50 బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా ఐడెన్ మార్క్రామ్ రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్పై కెవిన్ 50 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు ఐడెన్ మార్క్రామ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 54 బంతులు ఎదుర్కొన్న మార్క్రామ్ 106 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్లో క్వింటన్ డి కాక్ (100), రాస్సీ వాండర్ డస్సెన్ (108), ఐడెన్ మార్క్రమ్ (106) రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.