
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ కొద్ది రోజులుగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. అందుకే అతడిన్ని టీమ్ ఇండియా జాతీయ జట్టు నుంచి కూడా తప్పించింది మేనేజ్మెంట్. అయితే తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న శ్రేయాస్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు.

ఇప్పటివరకు ఆడిన ఏ దేశవాళీ మ్యాచ్లోనూ శ్రేయాస్ బ్యాట్ ద్వారా పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేదు. ఇటీవల ప్రారంభమైన రంజీ ట్రోఫీలో అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగింది. రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న అయ్యర్ బరోడాతో జరిగిన మ్యాచ్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

దీంతో ఈ దేశవాళీ ఎడిషన్లో అయ్యర్ మూడోసారి సున్నాకి అవుటై చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీకి ముందు జరిగిన దులీప్ ట్రోఫీలో అయ్యర్ బ్యాట్తో ప్రభావం చూపలేదు. భారత్ 'డి' జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అయ్యర్ రెండు జీరో స్కోర్లు నమోదు చేశాడు. ఇప్పుడు రంజీల్లోనూ జీరో సాధించాడు.

రెడ్ బాల్ క్రికెట్లో అతని ప్రదర్శన నిలకడగా లేదు. షార్ట్ పిచ్ బంతులపై అతని బలహీనత మళ్ళీ బయటపడింది. ఇది అతని అంతర్జాతీయ కెరీర్పై కూడా ప్రభావం చూపుతోంది. అతని పేలవమైన ఫామ్ టెస్టు జట్టులో అతని స్థానంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అయ్యర్కు అవకాశం రాలేదు.

అటు ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు అయ్యర్ను ఎంపిక చేసే ఛాన్స్ లేదని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అతను న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల హోమ్ టెస్ట్ సిరీస్కు కూడా దూరంగా ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే పేలవమైన ఫామ్ కారణంగా అయ్యర్ అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని అర్థమవుతోంది.