
World Cup 2023: వన్డే ప్రపంచకప్నకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్కు భారత జట్టును కేవలం ఏమాత్రం అనుభవం లేని నలుగురి చేతిలో పెట్టడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.

సెలక్షన్ కమిటీ హెడ్గా ఉన్న చేతన్ శర్మ ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్లో చిక్కుకోవడంతో తన పదవికి రాజీనామా చేశాడు. అయితే ఖాళీగా ఉన్న సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టును భర్తీ చేసేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడంలేదు. కాబట్టి నలుగురు సభ్యులు మాత్రమే టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు.

శివసుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ నలుగురు వన్డే ప్రపంచకప్నకు భారత జట్టును ఎంపిక చేయనున్నారు.

ఆశ్చర్యకరంగా ఈ నలుగురిలో ఒకరు టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మిగతా ముగ్గురు భారత్ తరపున మొత్తం 30 వన్డేలు ఆడారు. ఈ సెలక్షన్ కమిటీ సభ్యుల అంతర్జాతీయ మ్యాచ్ల గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం..

శివసుందర్ దాస్: టీమ్ ఇండియా తరపున 23 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు.

సుబ్రోతో బెనర్జీ: భారతదేశం తరపున 6 వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

సలీల్ అంకోలా: టీమ్ ఇండియా తరపున 1 టెస్ట్, 20 వన్డేలు ఆడాడు.

శ్రీధరన్ శరత్: టీమ్ ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 139 మ్యాచ్లు ఆడాడు.

ఇప్పుడు ఈ నలుగురు భారత జట్టును ఎంపిక చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇదే కమిటీ 2022 టీ20 ప్రపంచకప్నకు టీమిండియాను ఎంపిక చేసింది. అలాగే, ఈ కమిటీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు జట్టును ఎంపిక చేసింది.

టీమిండియా తరపున ఏ మేజర్ టోర్నీ, కనీసం 25 వన్డే మ్యాచ్లు ఆడని మాజీ ఆటగాళ్లతో కూడిన కమిటీ ముఖ్యమైన టోర్నీలకు జట్టును ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరు జట్టును ఎంచుకుంటే కప్ కలను వదిలేయాలని పలువురు సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

ఎందుకంటే టీ20 ప్రపంచకప్కు ఎంపికైన జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పేలవ ఫామ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది జట్టు నుంచి తప్పించడం కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు అదే కమిటీ వన్డే ప్రపంచకప్నకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేయాల్సిందే.