IPL 2021: ఐపీఎల్ రెండో దశ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధమైన టీ20 లీగ్ మరోసారి యూఏఈలో జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వర్సెస్ ముంబై మ్యాచుతో ఈ పోటీలు మొదలుకానున్నాయి. అయితే, ఈ టోర్నమెంట్లో చాలా పెద్ద స్కోర్లు తరచుగా కనిపిస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో భారీ వ్యక్తిగత స్కోర్లు చేసిన బ్యాట్స్మెన్స్ ఎవరో తెలుసుకుందాం.
ఈ జాబితాలో మొదటి పేరు దిగ్గజ వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పేరు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, తుఫాన్ ఇన్నింగ్స్కు మారుపేరుగా ఈ బ్యాట్స్మెన్ పేరుగాంచాడు. 23 ఏప్రిల్ 2013 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ స్కోర్ నమోదు చేశాడు. సహారా పుణె వారియర్స్పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. గేల్ తన ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డు సృష్టించాడు.
ఈ టోర్నమెంట్ చరిత్రలో రెండవ స్థానంలో నిలిచిన బ్యాట్స్మెన్ బ్రెండన్ మెకల్లమ్. ఈ బ్యాట్స్మెన్ 158 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 18 ఏప్రిల్ 2008 న ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్లో ఆర్సీబీకి వ్యతిరేకంగా ఈ సంచలన ఇన్నింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తరపున మెక్కల్లమ్ గొప్ప అరంగేట్రం చేశాడు. మెక్కల్లమ్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.
మూడవ స్థానంలో మరొక లెజెండరీ బ్యాట్స్మెన్ ఆర్సీబీ తరుపున ఈ స్కోర్ నమోదు చేశాడు. 10 మే 2015 న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్పై దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏబీడీ కేవలం 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 పరుగులు బాదేశాడు. అతను విరాట్ కోహ్లీ (82) తో కలిసి 215 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
ఈ జాబితాలో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. 2020 సీజన్లో దుబాయ్లో ఆర్సీబీకి వ్యతిరేకంగా రాహుల్ 128 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 132 పరుగులు చేశాడు.
ఇక ఐదో స్థానంలో మరో భారత బ్యాట్స్మెన్ నిలిచాడు. రిషబ్ పంత్ ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఈ యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్మన్ 128 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 15 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీలో సన్ రైజర్స్ హైదరాబాద్పై 2018 మే 10 న ఈ స్కోర్ నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచులో ఢిల్లీ జట్టు ఓడిపోవడం గమనార్హం. ఎందుకంటే శిఖర్ ధావన్ ఎస్ఆర్హెచ్ తరపున 92 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.