
IND vs USA, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సూర్యసారథ్యంలోని భారత జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడమే కాకుండా ఓ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు సాధించని ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

గత టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో రోహిత్ సేన సారథ్యంలోని భారత జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్లను గెలిచి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నమెంట్లోని తొలి మ్యాచ్లోనే అమెరికాను ఓడించడం ద్వారా భారత జట్టు టీ20 ప్రపంచ కప్లో వరుసగా తొమ్మిదవ విజయాన్ని సాధించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డును భారత్ నెలకొల్పింది. ఈ విజయానికి ముందు, భారత జట్టు వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మొదటి స్థానంలో ఉంది. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను భారత్ బీట్ చేసింది.

ఈ విజయం భారత జట్టుకు మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే, మ్యాచ్ పేలవంగా ప్రారంభమైంది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 84 పరుగులతో భారత జట్టును 161 పరుగులకు చేర్చాడు. ఛేజింగ్ లో అమెరికాను 132 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సూర్యకుమార్ యాదవ్ తప్ప, మరే ఇతర భారత బ్యాటర్ కూడా 30 పరుగులకు చేరుకోలేకపోయాడు. ఇది టోర్నమెంట్ ప్రారంభంలో జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. టోర్నమెంట్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలమైన జట్టుగా పేరుగాంచింది. కానీ అమెరికా వంటి జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్లోనే ఎదురుదెబ్బ తగిలింది.

టీమిండియా గ్రూప్లో అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత జట్టు తదుపరి మ్యాచ్ నమీబియాతో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత, భారత జట్టు కొలంబోకు వెళ్లి పాకిస్తాన్తో తలపడుతుంది. చివరగా ఫిబ్రవరి 18న నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్తో తలపడుతుంది.