
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 చివరి అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజిలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయినా.. భారత్ ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్ చేరుకుంది. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టులో సెమీఫైనల్ పోరులో తలబడనున్నాయి.

లీగ్ దశలో, ఇండియా ఛాంపియన్స్ తమ చివరి మ్యాచ్ను దక్షిణాఫ్రికా ఛాంపియన్స్తో ఆడగా, భారత ఆటగాళ్లు భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రత్యర్ధికి భారీ స్కోర్ సాధించేలా చేశారు.

ఈ మ్యాచ్లో 211 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి 54 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో భారత ఛాంపియన్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.

జట్టుకు ఓపెనర్గా వచ్చిన రాబిన్ ఉతప్ప 23 పరుగులు చేయగా, నమన్ ఓజా 5 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం సురేశ్ రైనా కూడా 21 పరుగుల వద్ద పెవిలియన్కు చేరుకున్నాడు. అంబటి రాయుడు 2 పరుగులు, కెప్టెన్ యువరాజ్ సింగ్ 5 పరుగులు చేశారు. ఇక యూసుఫ్ పఠాన్ ఒక్కడే 54 పరుగులతో అజేయంగా నిలిచాడు.

జూలై 12న ఆస్ట్రేలియాతో భారత్ ఛాంపియన్స్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో, మొదటి సెమీఫైనల్లో, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు కూడా జూలై 12న తలపడనున్నాయి.