
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన మహిళల T20 ప్రపంచకప్ మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది.

ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టుకు అలీసా హీలీ (25), బెత్ మూనీ (54) శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన మెగ్ లున్నింగ్ 34 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసింది. ఇక గార్డనర్ కేవలం 18 బంతుల్లో 31 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (2) వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన యాషికా భాటియా (4) రనౌట్ అయింది.

ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 4వ వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేపారు. అయితే జెమీమా 24 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటైంది. ఆతర్వాత హర్మన్ప్రీత్ కౌర్ (52) అర్ధసెంచరీ తర్వాత రనౌటైంది.

ఆతర్వాత రిచా ఘోష్ (14) కూడా కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా విజయానికి చివరి 4 ఓవర్లలో టీమిండియాకు 38 పరుగులు కావాలి. ఈ దశలో దీప్తి శర్మ, స్నేహ రాణా చక్కటి బ్యాటింగ్ను ప్రదర్శించారు.

ఇక చివరి ఓవర్లో 16 పరుగులు కొట్టాల్సి ఉండగా టీమిండియా కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 5 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.