
కేప్ టౌన్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ భారత జట్టుకు చాలా ప్రత్యేకమైనదని నిరూపించవచ్చు. ఇందులో టీమిండియా సూపర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకం కానున్నాడు. ఎందుకంటే ఈ న్యూలాండ్స్ మైదానం బుమ్రాకు చాలా ప్రత్యేకమైనది. బుమ్రా టెస్టు కెరీర్ నాలుగేళ్ల క్రితం ఇదే మైదానంలో ప్రారంభమైంది. మరోసారి బుమ్రా ఇక్కడ సత్తా చాటేందుకు వచ్చాడు.

జనవరి 11న ప్రారంభమయ్యే కేప్ టౌన్ టెస్టుకు ముందు, బుమ్రా నాలుగేళ్ల క్రితం కేప్ టౌన్లో తన ప్రయాణం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. భావోద్వేగ సందేశాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నాడు. బుమ్రా ట్వీట్లో ఏముందంటే.. "కేప్ టౌన్, జనవరి 2018- ఇక్కడే నాకు టెస్ట్ క్రికెట్ ప్రారంభమైంది. నాలుగు సంవత్సరాల తరువాత మరోసారి ఇక్కడ అడుగుపెట్టాను. ఇన్నేళ్లలో నేను ఒక ఆటగాడిగా, ఒక వ్యక్తిగా మారాను. ఈ మైదానానికి తిరిగి రావడం ప్రత్యేక జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది" అంటూ ట్వీట్ చేశాడు.

2016లో టీ20, వన్డేల నుంచి టీమ్ ఇండియాలో చోటు సంపాదించిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా 2018 జనవరి 5న కేప్ టౌన్లోనే టెస్టు అరంగేట్రం చేశాడు. బుమ్రా తొలి వికెట్గా దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తం 4 వికెట్లు తీశాడు.

ఇక్కడి నుంచి అతను టీమ్ ఇండియా అగ్రగామి ఫాస్ట్ బౌలర్గా మారాడు. ఇప్పటివరకు కేవలం 26 టెస్టుల్లో 107 వికెట్లు పడగొట్టాడు. 4 ఏళ్ల క్రితం కేప్టౌన్లో సిరీస్లో తొలి మ్యాచ్ జరిగింది. ఈసారి సిరీస్లో చివరి మ్యాచ్ జరగనుంది. అప్పుడు బుమ్రా భారత్ను గెలిపించడంలో విఫలమయ్యాడు. కానీ, 4 సంవత్సరాల తర్వాత అతను న్యూలాండ్స్ పిచ్పై విధ్వంసం సృష్టించి భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.