ఈరోజు మహిళా క్రికెట్ దిగ్గజం ఫాస్ట్ బౌలర్ జూలన్ గోస్వామి పుట్టినరోజు. నవంబర్ 25, 1982న పశ్చిమ బెంగాల్లోని చక్దాహాలో జన్మించిన జూలన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జూలన్ గోస్వామి నిలిచింది. వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కింది.
క్రికెటర్గా మారేందుకు జూలన్ ప్రయాణం చాలా కష్టంతో కూడుకుంది. కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో జూలన్ జన్మించింది. ఆమె క్రికెట్ శిక్షణ కోసం కోల్కతాకు వెళ్లేది. జూలన్ రైలులో ప్రయాణించి, శిక్షణకు వచ్చేది. చాలా సార్లు రైలు తప్పిపోయినా, తన పట్టు వదలకుండా శిక్షణకు వచ్చేది. దీంతోనే ఈ రోజు ప్రపంచం ఆమెకు సెల్యూట్ చేసే స్థాయికి చేరుకుంది.
2006లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఇంగ్లండ్లో తొలి టెస్ట్ సిరీస్ను గెలుచుకోవడం జూలన్ కెరీర్లో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో జూలన్ 10 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 33 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్లో కేవలం 45 పరుగులకే 5 వికెట్లు పడగొట్టింది.
2007లో జూలన్ గోస్వామి ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును ఎంఎస్ ధోని చేతులతో అందుకోవడం విశేషం. ఇక 2011లోనూ జూలన్ ఈ అవార్డును గెలుచుకుంది. 2016లో ఆమె నంబర్ వన్ వన్డే బౌలర్గా నిలిచింది.
జూలన్ గోస్వామి ఆ సమయంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలిచారు. ఒక సమయంలో జూలన్ సగటు వేగం 120 కి.మీ. గా ఉండేది. క్యాథరిన్ ఫిట్స్పాట్రిక్ తర్వాత జూలన్ అత్యంత వేగంగా బంతిని విసిరేది.