షారుఖ్ ఖాన్, కావ్య మారన్లకు షాక్ ఇస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది క్రికెట్ బోర్డు.
జూలై 31న ముంబై వేదికగా ఫ్రాంచైజీలతో క్రికెట్ బోర్డు సమావేశమైంది. రిటైన్ ప్లేయర్స్, ఐపీఎల్ 2025 మెగా వేలం, RTM లాంటి అంశాలపై కీలకంగా చర్చించారు. ఇక ఈ మీట్లో కేకేఆర్ యజమాని షారుఖ్, ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ మెగా వేలాన్ని ఐదేళ్లకొకసారి నిర్వహించాలని.. ఇలా చేయడం ద్వారా జట్టు నిలకడ, ప్రధాన ఆటగాళ్ల కంటిన్యూటీపై ప్రభావం పడదని పేర్కొన్న విషయం విదితమే.
అయితేనేం వారి సూచనలను అటుంచితే.. వచ్చే ఏడాదికి మెగా ఆక్షన్ నిర్వహించాలని చూస్తోందట బీసీసీఐ. అలాగే రిటెన్షన్, రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా 6-8 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంచైజీలకు బోర్డు అనుమతించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించి కీలక నిబంధనలను నెలాఖరులోగా బోర్డు ఖరారు చేయనుందట.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొందరు ఫ్రాంచైజీలు ఈ రూల్కు సుముఖతగా ఉంటే.. మరికొందరు ఈ రూల్ను తీసేయాలని బోర్డును కోరారు.
అటు ఐపీఎల్ను అర్ధాంతరంగా విడిచిపెడుతున్న విదేశీ ప్లేయర్స్పై రెండేళ్ల పాటు బ్యాన్ విధించనుంది బీసీసీఐ. టోర్నమెంట్ నుంచి గాయం కారణంగా వైదొలిగిన ప్లేయర్స్కు ఈ రూల్ వర్తించదట.