
ODI World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు భారత జట్టు పలు దేశాలతో సిరీస్లు ఆడుతూ బిజీబిజీగా ఉండనుంది. ఈ క్రమంలో క్రికెట్ కార్నివల్ కోసం బీసీసీఐ భారీ సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందు టీమిండియాకు 3 శుభవార్తలు అందాయి.

భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర నుంచి క్రికెట్కి దూరంగా ఉన్న బూమ్రా పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే నెట్స్లో ప్రాక్టీస్ ప్రారంభించిన యార్కర్స్ కింగ్ ప్రతిరోజూ 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడంట. గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో బుమ్రా లేకపోవడం వల్ల టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అలాగే ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా బుమ్రా పెద్ద లోటుగా పరిణమించింది. ఈ క్రమంలో బూమ్రా పునరాగమనం శుభపరిణామం అని చెప్పుకోవాలి.

మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కూడా రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో గాయపడిన అయ్యర్ అనంతరం జరిగిన ఐపీఎల్ 16వ సీజన్కి దూరంగా ఉన్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్న అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆరంభించాడు. వన్డే ప్రపంచకప్కు ముందు అయ్యర్ కూడా భారత జట్టులో చేరితే అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుంది..!

వీరిద్దరే కాక కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు కోలుకున్నాడు. ఆ కారణంగానే ఐపీఎల్ 2023 సీజన్కి దూరమైన అతను నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇలా ఈ ముగ్గురు క్రికెట్ కార్నివల్ కంటే ముందు భారత జట్టుకు అందుబాటులో ఉంటే.. కప్ మరోసారి మన సొంతం చేసుకునేందుకు బలం చేకూరుతుంది.