
వాళ్లంతా విద్యార్థులు.. సర్కారు బడిలో చదువుకుంటున్నారు. స్కూలు ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి బయలుదేరారు. స్కూలు నుంచి ఇంటికి వెళ్లాలంటే దూరం. బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వర్షం కురుస్తోంది. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం చూస్తూ వర్షంలోనే తడుస్తున్నారు. దీంతో అటువైపుగా.. వెళ్తున్న కలెక్టర్ కు ఆ విద్యార్థులు కనిపించారు.

ఒక్కసారిగా చలించి పోయారు. వారితో మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు కలెక్టర్. స్కూలు నుంచి ఇంటికి బయలుదేరామని.. బస్సు కోసం వేచి చూస్తున్నామని చెప్పడంతో కలెక్టర్ పెద్ద మనసు చాటుకున్నారు. వారిని తన కారులో ఎక్కించుకుని.. గమ్యస్థానానికి చేర్చారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో ఈ ఘటన జరిగింది.

జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.. మాడుగులలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే బంగారు మెట్ట కూడలిలో కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ కనిపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ గమనించి వెంటనే తన కారు ఆపారు. వారి నుంచి వాకబు చేశారు. బస్సు కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు.

విద్యార్థులు బస్సు కోసం వేచి చూస్తున్నట్టు చెప్పడంతో వర్షంలో తడుస్తున్న ఆ విద్యార్థుల పరిస్థితిని చూసి చలించి పోయారు కలెక్టర్. తన కారులో ఆ విద్యార్థులను ఎక్కించుకోకుండా ఉండలేకపోయారు. విద్యార్థులను ఏ ఊరికి వెళ్లాలనేదీ వాకబు చేసి.. వారి సొంతూరు చిన్నప్పన్నపాలెంలో క్షేమంగా దింపారు.

కాగా.. ఎప్పుడూ కలెక్టర్ గురించి తెలుసుకోవడమే తప్ప నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో పాటు.. ఆమెతో మాట్లాడడం.. కలెక్టర్ వాహనంలోనే ప్రయాణించడం పై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించిన కలెక్టర్ తీరు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.