
ప్యాన్ ఇండియన్ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత కరోనా వైరస్ కంటే ఫాస్టుగా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు ప్యాన్ ఇండియన్ మోజు పట్టుకుంది. అయితే ఎందుకో తెలియదు గానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి.. క్వాలిటీ చెక్ కోసమే టైమ్ తీసుకుంటున్నారు మన స్టార్స్.

ప్యాన్ ఇండియా బ్రాండ్తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే.. చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నట్లున్నారు. అందుకే రీ షూట్స్ చేసైనా.. క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వాలని ఫిక్సైపోయారు.

చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజా సాబ్, తేజ సజ్జా మిరాయ్ లాంటి సినిమాలు అనుకున్న దానికంటే ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. కొన్నేళ్ళుగా ప్యాన్ ఇండియన్ సినిమాల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది.

ఇంకా చెప్పాలంటే కల్కి, దేవర, పుష్ప 2 మినహా.. మరే సినిమా హిట్ అవ్వలేదు. గేమ్ ఛేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. రాబోయే రెండేళ్లలోనూ మహా అయితే ప్రభాస్ నుంచి రాజా సాబ్, ఫౌజీ.. ఎన్టీఆర్ నుంచి వార్ 2.. చరణ్ నుంచి పెద్ది సినిమాలు రానున్నాయి.

పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు, ఓజి వస్తున్నా.. ఇప్పటి వరకు ఆయన ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయలేదు. ఇక హిట్ 3తో నాని.. కుబేరతో ధనుష్ తెలుగులో మాత్రమే హిట్ కొట్టారు. ఈ ఏడాది ఆశలన్నీ ఓజి, అఖండ 2, రాజా సాబ్.. 2026లో ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్పైనే ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. ప్యాన్ ఇండియన్ హవా ఒకప్పట్లా లేదనేది కాదనలేని వాస్తవం.