
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేరాఫ్ అడ్రస్లు మారిపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఒక్క నిర్మాతకే వరసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్లు చేస్తున్నారనేకంటే.. అక్కడే వాళ్లను బయటికి పోనీకుండా లాక్ చేస్తున్నారంటే కరెక్టేమో..? త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్.. వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరస సినిమాలు చేస్తున్నారు.

త్రివిక్రమ్నే తీసుకోండి.. ఈయన సినిమా అనౌన్స్ చేసారంటే చాలు వెనక హారిక హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే. 2012లో వచ్చిన జులాయి నుంచి ఇప్పుడు చేస్తున్న అల్లు అర్జున్ సినిమా వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే.

బయటి నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు. అనిల్ రావిపూడి పూర్తిగా దిల్ రాజుకు ఇంటి మనిషి అయిపోయారు. అనిల్ చేసిన 8 సినిమాల్లో 6 సినిమాలు దిల్ రాజు బ్యానర్లోనే చేసారు.

ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ధనుష్ కుబేరా సినిమాను అక్కడే తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే మరో సినిమాను ఇదే సంస్థలో ప్రకటించారు కమ్ముల. తండేల్ తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్లోనే సినిమా చేయబోతున్నారు చందూ మొండేటి.

రంగస్థలం నుంచి మైత్రి మూవీ మేకర్స్లోనే ఉండిపోయారు సుకుమార్. పుష్పతో మైత్రికి మెమొరబుల్ సినిమా ఇచ్చారు.. నెక్ట్స్ చరణ్ సినిమా కూడా ఇదే బ్యానర్లో చేస్తున్నారు లెక్కల మాస్టారు. సందీప్ రెడ్డి వంగా సైతం టీ సిరీస్ భూషణ్ కుమార్తోనే కబీర్ సింగ్, యానిమల్ చేసారు. నెక్ట్స్ అనౌన్స్ చేసిన స్పిరిట్తో పాటు బన్నీ సినిమాలు కూడా ఇదే బ్యానర్లో ఉన్నాయి.