
ఈ మధ్య ఆడియన్స్ మరీ కఠినంగా మారిపోతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో ఉంటే.. ఎలా ఉన్నా కనీసం మూడు రోజులైనా థియేటర్స్కు వచ్చేవాళ్లు. దాంతో ఫ్లాప్ అయినా కూడా నష్టాలు కాస్త తక్కువగానే వచ్చేవి.

కానీ ఇప్పుడలా కాదు.. సినిమా బాగోలేకపోతే మ్యాట్నీ షో నుంచే వాకౌట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే లాసెస్ కూడా భరించలేనంతగా వస్తున్నాయి. గత రెండు మూడేళ్లుగా కొన్ని సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు వింటుంటే.. ఆ నిర్మాతలు, బయ్యర్లను చూసి పాపం అనడం తప్ప ఇంకేం చేయలేం.

తాజాగా థగ్ లైఫ్నే తీసుకోండి.. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా రెండో రోజే థియేటర్స్లో కనబడలేదు.. జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. బయ్యర్లు నిండా మునిగిపోయారు.

ఎందుకో తెలియదు గానీ తమిళంలోనే ఇలాంటి కళాఖండాలు ఎక్కువగా వస్తున్నాయి. గతేడాది శంకర్, కమల్ కలయికలో వచ్చిన భారతీయుడు 2 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో..? ఈ ఒక్క సినిమాతో శంకర్ కెరీర్ కూడా మునిగిపోయింది. అలాగే సూర్య కంగువా, రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాలు కూడా అంతే.. వీటి నష్టాలు కూడా వందల కోట్లల్లో ఉన్నాయి.

తెలుగులోనూ నిండా ముంచేసిన సినిమాలు ఈ మధ్య బాగానే వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ 100 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది.. అలాగే ఆచార్య, భోళా శంకర్ నష్టాలు మామూలుగా లేవు. ప్రభాస్ రాధే శ్యామ్కు 100 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. ఈ షాకుల నుంచి కోలుకోడానికి నిర్మాతలకు చాలా టైమ్ పట్టింది.. కొందరైతే ఇంకా బయటికి రాలేదు. అలా మొత్తానికి ముంచేస్తున్నాయి కొన్ని సినిమాలు.